పేదలకు కేటాయించిన స్థలాలను కబ్జా చేసిన వ్యక్తులపై – టిడిపి నేతల ఆగ్రహం..న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా..
కిరణ్ 24×7 న్యూస్ :
కొందరు నేతలు అధికారులతో కుమ్మక్కై పేద ప్రజలకు చెందాల్సిన పార్కు స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారంటూ సోమవారం టిడిపి నాయకులు నేతలు ధర్నా నిర్వహించారు.
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలోని ఎర్రగుంట్ల రోడ్డులో 1992 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇల్లు లేని పేదల కోసం ఒక్కొక్కరికి 2.5 సెంట్ల స్థలాలను కేటాయించింది.ఆ లేఔట్లో ప్రజల వినియోగార్థం ప్రత్యేకంగా పార్కు కోసం కూడా ఖాళీ స్థలాన్ని కేటాయించారు. కాలక్రమేణా ఆ ప్రదేశం మొత్తం కంపచెట్లు పెరిగి నిర్లక్ష్యంగా మారింది.
2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త డి. విష్ణువర్ధన్ రెడ్డి స్వంత నిధులతో ఆ స్థలాన్ని శుభ్రపరచించి లేఔట్ వేయించినట్లు స్థానికులు తెలిపారు.అయితే 2019లో అప్పటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు పట్టణానికి చెందిన కొంతమంది నాయకులు ఆ పార్కు స్థలంపై కన్నేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
పార్కు కోసం కేటాయించిన స్థలానికి దొంగ పట్టాలు సృష్టించి, అక్కడ బండలు పాతి స్థలాన్ని కబ్జా చేశారని స్థానికులు కాలనీ ప్రజలు టిడిపి నాయకుల దృష్టికి తీసుకెళ్లగా, వారు మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులతో మాట్లాడి పార్కు స్థలాన్ని యథావిధిగా ప్రజల వినియోగానికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నగర పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 
అక్రమంగా పొందిన ప్లాట్లను రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం తెలిసిన వెంటనే గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుల్లాయప్ప అక్కడికి చేరుకుని వారిని సముదాయించి ధర్నాను విరమింప చేశారు అనంతరం నగర పంచాయతీ కమిషనర్ టిడిపి నేతలతో మాట్లాడి పేదల స్థలాలను కబ్జా కాకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో టిడిపి నేతలు ధర్నాను విరమించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షులు మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు టిడిపి పట్టణ నాయకులు రేమట వెంకటేశ్వర్లు, సృజన్ ,కౌన్సిలర్లు కోడుమూరు షాషావలి, ఎల్లయ్య, వీర సులేమాన్ అబ్రహం మరియు స్థానిక టిడిపి నాయకులు నేతలు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.







