మున్సిపాలిటీ నీటి తొట్టిలో పడి చిన్నారి బాలిక మృతి..

కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు పట్టణంలోని పడమర బీసీ కాలనీ ఎస్ఎస్వి కళాశాల వెనుకవైపు ఉన్న కొట్టాల కాలనీలో శనివారం మధ్యాహ్నం చిన్నారి బోయ విజయలక్ష్మి(5) అనే బాలిక ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు మున్సిపాలిటీ వారు ఏర్పాటుచేసిన నీటి తొట్టి లో పడి మృతి చెందింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు సమాచారం.. బోయ రేవుల గోపాల్ మరియు శ్రీదేవి దంపతులకు ఒక కూతురు విజయలక్ష్మి (5),కుమారుడు గోపీచంద్(7) కలరు. తల్లిదండ్రులు ఇద్దరు బ్రతుకుతెరువు కోసం గుంటూరుకు వలస వెళ్లారు. తమ కూతురు బోయ విజయలక్ష్మి నీ తాత పాపన్న దగ్గరే ఉంచి వెళ్లారు. తాత అవ్వ మనవరాలిని చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం తాత అవ్వ వారి పనుల్లో నిమగ్నం అయిన సమయంలో మనవరాలు బోయ విజయలక్ష్మి ఆటలాడుకుంటూ కాలనీలో సమీపంలో ఉన్న మునిసిపాలిటీ నీటి తొట్టి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది.

మనవరాలు కనిపించడం లేదంటూ తాత పాపన్న వెతుకుతూ వెళ్లి చూసేసరికి మనవరాలు నీటి తొట్టి లో మృతదేహంలా పడి ఉంది. చిన్నారి మనవరాలు నీటి తొట్టి లో పడి మృతి చెందడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపించారు.

నీటి తొట్టిల ఏర్పాటు ప్రమాదకరంగా మారాయని కాలనీ ప్రజలు అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదంటూ కాలనీ ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నీటి తొట్టి లకు మూతలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.