గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా రాజా కుళ్లాయప్ప బాధ్యతల స్వీకరణ..

కిరణ్ 24×7 న్యూస్:

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ, సివిల్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. రాజా కుళ్లాయప్ప , తన శిక్షణ పూర్తి చేసిన అనంతరం చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో పి.ఎస్‌.ఐగా విధులు నిర్వహించారు. అనంతరం పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ బదిలీపై గూడూరు పోలీస్ స్టేషన్‌కు ఎస్‌.హెచ్‌.ఓగా నియమితులై, బుధవారం 17.12.2025 అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా బి. రాజా కుళ్లాయప్ప మాట్లాడుతూ, గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సామాజిక వ్యతిరేక శక్తులు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు తక్షణమే తమ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే, ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అదేవిధంగా, ప్రజలకు ఎలాంటి సమస్యలు, అన్యాయాలు జరిగినా, లేదా పోలీస్ సహాయం అవసరమైన సందర్భాలలో నేరుగా గూడూరు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, ప్రజల హక్కుల పరిరక్షణకు మరియు న్యాయం అందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ప్రజల సహకారంతో గూడూరు పట్టణంలో శాంతి భద్రతలు మరింత మెరుగుపరచడం, నేరరహిత వాతావరణాన్ని నెలకొల్పడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు పోలీస్ శాఖతో సమన్వయం కలిగి పనిచేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.